స్థానిక సంస్థల ఎన్నికలలో కేరళలోని అధికారిక పార్టీ ఎల్డిఎఫ్ (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్) విజయ ఢంకా మోగించింది. మొత్తం 30 వార్డులలో 16 వార్డులను గెెలుచుకుంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్తో కూడిన యుడిఎఫ్ 12 వార్డులలో గెలుపొందగా, బిజెపి ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పోయింది. కాగా, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డులు గెలుచుకోగా, విప్లవ మార్క్సిస్ట్ పార్టీ ఒక సీటును గెలుచుకుంది. ఈ ఉప ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగగా, శుక్రవారం కౌంటింగ్ నిర్వహించారు. సుమారు 80.12 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తిన ప్రాంతాలలోనే ఎల్డిఎఫ్ అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. పథంతిట్టలోని పశ్చిమ రాన్నిలోని పుత్తుసరిమల గ్రామ పంచాయితీ నుండి సుధాకుమారి ఎన్నికవగా, కొల్లాంలోని చిట్టుమలా బ్లాక్ గ్రామపంచాయితీ పెరుమోన్ నుండి 1,055 ఓట్లతో గీతా బాలకృష్ణన్ గెలుపొందారు. అలాగే కయంకులం మునిసిపాలిటీలోని ఎరువ నుండి 446 ఓట్ల మెజారిటీతో సుష్మా అజయన్, ఎర్నాకులంలోని వైటిల్లా జనతా విభాగం నుండి 58 ఓట్లతో బైజు జేసుదాస్ గెలుపొందారు.