ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లీటర్ పెట్రోల్ రూ.48, డీజిల్ రూ.69.. లెక్కలతో సహా మల్లికార్జున ఖర్గే ట్వీట్

national |  Suryaa Desk  | Published : Mon, Sep 16, 2024, 10:43 PM

దేశంలో గత 10 ఏళ్లలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై.. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తరచూ తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గించి.. కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగిస్తోంది. దీంతో ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి.. ఆ తర్వాత పెంచి.. మోదీ సర్కార్ సామాన్యుల నడ్డి విరుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే.. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌కు.. అంతకుముందు 10 ఏళ్లు అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌కు.. పెట్రోల్ డీజిల్ ధరల వ్యత్యాసంపై లెక్కలతో సహా బయటపెట్టి తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సంచలన ట్వీట్ చేశారు.


అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గత నెలలుగు తగ్గుతున్నప్పటికీ.. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఇందన దోపిడీ మాత్రం తగ్గట్లేదని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించిన ఆయన.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇంధన దోపిడీ ఆపాలంటూ ఓ ఫోటోను కూడా ఖర్గే ట్వీట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు 32.5 శాతం తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ మేరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం లేదని ఖర్గే మండిపడ్డారు. మరికొన్ని రోజుల్లో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని.. ఆ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీని ఓడించి, నరేంద్ర మోదీ పెంచుతున్న ధరల పెరుగుదలను తిరస్కరిస్తాయని ఖర్గే వెల్లడించారు.


ఈ క్రమంలోనే 2014కు ముందు తర్వాత దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల వ్యత్యాసాన్ని అంకెలతో సహా ట్వీట్ చేశారు. అంతేకాకుండా అప్పుడు క్రూడాయిల్ ధర, ఇప్పుడు క్రూడాయిల్ ధర ఆధారంగా.. ప్రస్తుతం దేశంలో ఉండాల్సిన పెట్రోల్, డీజిల్ ధరలను కూడా అంచనా వేసి ఖర్గే వివరించారు. 2014 మే 16వ తేదీన ఒక బ్యారెల్ ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 107.49 డాలర్లు ఉండగా.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.51, డీజిల్ ధర రూ.57.28 ఉందని తెలిపారు. కానీ.. 2024 సెప్టెంబర్ 16వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 72.48 డాలర్లు ఉన్నా.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72.. డీజిల్ ధర రూ.87.62 ఉందని తెలిపారు.


అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ.. ఆ మేరకు దేశ ప్రజలకు మాత్రం పెట్రో భారం తప్పడం లేదని మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అప్పటి ధరలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ముడి చమురు ధరల ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర రూ.48.27 ఉండాలని.. అదే సమయంలో డీజిల్ ధర రూ.69 ఉండాలని ఖర్గే తెలిపారు. ఇక గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. పెట్రోల్, డీజిల్ ధరలపై భారీగా పన్నులు విధించి.. దేశ ప్రజల సొమ్మును ఏకంగా రూ.35 లక్షల కోట్లు దోచుకుందని ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com