శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును అమలు చేసేందుకు కేరళలోని సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం కట్టు బడి ఉన్నదని ఆ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ పి. సదాశివం తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నదని చెప్పారు. లింగ సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హుందాతనాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ కృషిని ఆయన ప్రశంసించారు. ''రాష్ట్రంలోని మా ప్రభుత్వం లింగ సమానత్వానికి హామీ ఇస్తోంది. మహిళల శబరిమల ఆలయ ప్రవేశానికి వయస్సుకు సంబంధించిన ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.'' అని సదాశివం అన్నారు.