ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అమరావతిలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆహ్వానించనున్నారు. అలాగే వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతోనూ ఆయన సమావేశం కానున్నారు. బుధవారం జరగనున్న బీజేపీయేతర పక్షాల భేటీలోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నారు. ఎర్రవల్లిలో రెండో రోజు యాగంలో పాల్గొని హారతి పూర్తయిన తర్వాత ఆయన మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకుంటారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయలుదేరుతారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి రాత్రికి హైదరాబాద్కు వస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.