ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్ పరీక్ష వివాదం.. ఎన్టీఏపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 09:43 PM

ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షా పత్రం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. నీట్‌లో ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకు రావడం.. వీరిలో ఒకే సెంటర్‌లో పరీక్ష రాసిన ఏడుగురు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా, దీనిపై సర్వోన్నత న్యాయస్థానం కూడా తీవ్రంగా స్పందించింది. ఇందులో 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కు మంగళవారం స్పష్టం చేసింది. ‘‘పరీక్షను నిర్వహిస్తున్న ఏజెన్సీగా మీరు న్యాయంగా వ్యవహరించాలి. తప్పు జరిగితే అవును, ఇది తప్పు అని చెప్పండి... దీనిపై మేము చర్య తీసుకుంటాం... కనీసం అది మీ పనితీరుపై విశ్వాసాన్ని కలిగిస్తుంది’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.


నీట్‌లో 1563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడమే ఈ గందరగోళానికి కారణమని, వారికి జూన్ 23న తిరిగి పరీక్షను నిర్వహిస్తామని, ఫలితాలను జూన్ 30న వెల్లడిస్తామని గతవారం సుప్రీంకోర్టుకు ఎన్టీఏ తెలియజేసింది. ఒకవేళ, ఈ అభ్యర్థులు పరీక్ష రాయడానికి అంగీకరించకపోతే అదనపు మార్కులు లేకుండా గతంలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. దేశవ్యాప్తంగా మే 5న నీట్ పరీక్షను నిర్వహించగా.. మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను జూన్ 4న ప్రకటించారు. అయితే, పరీక్షా పత్రం లీక్ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. 67 మంది విద్యార్థులు 720/720 మార్కులు సాధించారు.


అయితే, నీట్ పారదర్శకంగా జరగలేదని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పరీక్ష రోజున పలు కేంద్రాల్లో ఆలస్యంగా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని, కొందని జవాబు పత్రాలను చించేశారనే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షను రద్దుచేసి, మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఫలితాలను వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా అధికారికంగా ప్రకటించకపోవడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తీరా ఫలితాలపై 20 పేజీల పత్రికా ప్రకటనను జారీ చేసిన ఎన్టీఏ.. అందులో 1,563 మందికి గ్రేస్‌ మార్కులు కలిపిన విషయాన్ని ప్రస్తావించకపోవడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com