ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిప్పుల కుంపటిగా ఉత్తరాది.. ఢిల్లీ సహా పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 09:43 PM

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల అధికంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లోని ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్‌‌ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం (IMD) రెడ్ అలర్ట్ ప్రకటించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలకుపైగా నమోదవుతాయని, తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్షోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వేడిగాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో బిహార్‌లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.


రాజధాని ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదుకాగా.. జూన్‌ నెల సగటు కంటే ఇది 6 డిగ్రీల అధికం కావడం గమనార్హం. అయితే, 50 డిగ్రీల మాదిరిగా వాతావరణం ఉంటుందని ఐఎండీ సూచించింది. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఢిల్లీ నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెల్లి.. మూడు గంటల ఆలస్యమైంది. బుధవారం ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని వల్ల కొంత ఉపశమనం కలిగినా తర్వాత మళ్లీ ఎండలు మండిస్తాయని హెచ్చరించింది.


ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 43.1 డిగ్రీలు, ముస్సోరిలో 43 డిగ్రీలకు చేరుకున్నాయి. పౌరి, నైనిటాల్ వంటి ఎత్తైన కొండ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరో కొండప్రాంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌లో (44 డిగ్రీలు) సాధారణం కంటే దాదాపు 7 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యింది. జమ్మూ కశ్మీర్‌లోని కాట్రాలో 40.8 డిగ్రీలు, జమ్మూలో 44.3 డిగ్రీలు, యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో 47.6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయినట్టు ఐఎండీ వెల్లడించింది.


ఉష్ణోగ్రతల నుంచి వచ్చే వారం కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వారమంతా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనల్ డాక్టర్ కేజే రమేశ్ సక్సేనా అన్్నారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చే చల్లటి గాలులు ఆలస్యం కావడంతో మైదాన ప్రాంతాల్లో వేడి తీవ్రత కొనసాగుతుందని చెప్పారు. ‘జూన్ 1 నుంచి పశ్చిమ బెంగాల్‌లో రుతుపవనాలు స్తబ్దుగా ఉండటం మరో కారణం.. రుతుపవనాలు ఈ ప్రాంతాలను కవర్ చేయనంత కాలం ఉత్తరాదితో వేడిగాలులు కొనసాగుతాయి’ అని ఆయన తెలిపారు.


అయితే, ఈదురుగాలులు, చెదురుమదురు జల్లుల కారణంగా ఢిల్లీ కొంత ఉపశమనం కలిగినా అవి కొన్ని గంటలు మాత్రమేనని అన్నారు. ‘బుధవారం తర్వాత తాజాగా ఏర్పడిన ద్రోణి పవనాలు వాయువ్య భారతానికి చేరుకుంటుంది.. ఇది ఢిల్లీని కూడా ప్రభావితం చేస్తుంది.. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది’ ఐఎండీ తెలిపింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com