టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కక్ష సాధింపులకు నిరసనగా వైయస్ఆర్సీపీ దళిత నేత శిరోముండనం చేయించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశాడనే కోపంతో అధికారులను ఉపయోగించి మరీ నందెపు జగదీష్కు చెందిన భవనాన్ని జేసీబీతో కూల్చివేయించారు. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపానికి గురైన జగదీష్.. కూల్చేసిన భవనం ముందే శిరోముండనం చేయించుకుని అర్ధనగ్నంగా బోండా ఉమాకు నిరసన తెలియజేశారు. అనంతరం జగదీష్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేశానని అసూయతో, అధికార బలంతో భవనాలను కుప్పకూల్చారు. దీనిపై సీఎం చంద్రబాబుకు స్పందనలో ఫిర్యాదు చేస్తా. దళిత వైయస్ఆర్సీపీ నాయకుడిగా ఉండటం నేను చేసిన తప్పా?. బోండా ఉమాకు అధికారం తోడవడంతో ఇటువంటి అన్యాయాలు ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. నేను మాజీ కార్పొరేటర్, కో ఆప్షన్ మెంబర్ను. నాకు న్యాయం జరగకపోతే, నా కుటుంబ సభ్యులకి శిరోముండనం చేసుకొని నిరసన తీవ్రతరం చేస్తా. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు’’ అని జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు.