ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి శివారులోని కాశిపెంట్లలో గల హెరిటేజ్ పరిశ్రమకు వెళ్లిన సీఎం చంద్రబాబు.. అక్కడి గోకులం ప్లాంట్లో ఉద్యోగులు, పాడిరైతులతో ఆత్మీయ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26 సంవత్సరాలుగా ఎలాంటి అపవాదు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్న కంపెనీ హెరిటేజ్ అని ప్రశంసించారు. నీతి, నిజాయతీగా ఉంటే వ్యాపారులు కూడా సత్ఫలితాలను ఇస్తాయని, తప్పుడు పనులు చేసి వ్యాపారులు చేస్తే కచ్చితంటా పట్టుబడుతారని ఆయన అన్నారు. ఒకప్పుడు కుటుంబం కోసం ప్రారంభించిన హెరిటేజ్.. నేడు సమాజానికి ఉపయోగపడే కంపెనీగా ఎదిగిందన్నారు. ప్రతిరోజు 15లక్షల మంది వినియోగదారులకు కంపెనీ సేవలందిస్తోందని కొనియాడారు. హెరిటేజ్ దినదినాభివృద్ధి చెందాలని, దేశంలోనే డైరీ ఉత్పత్తుల్లో చిరునామాగా నిలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరిపై ప్రశంసలు కురిపించారు. హెరిటేజ్ సంస్థ కోసం ఆమె ఎంతగానో పాటుపడుతున్నారన్నారు.