తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాములవారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. అదేవిధంగా, శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.
మరోవైపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 18న రాత్రి 8 నుంచి 9 గంటల నడుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
ఏప్రిల్ 22న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పగడ్భంది ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, జిల్లా ఎస్సీ సిదార్థ కౌశల్ తో కలసి ఈవో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పిఏసిలోని సమావేశ హాలులో ఈవో బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఏప్రిల్ 22న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు జరిగే శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ, జిల్లా యంత్రాగంతో సమన్వయం చేసుకుని ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు ఈవో ధర్మారెడ్డి. కల్యాణానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, విరివిగా అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటర్లలోను, గ్యాలరీలలో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీకి అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
భద్రత, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, కల్యాణోత్సవం సందర్బంగా విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం, వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు తదితర అంశాల పై సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ ఏడాది భక్తులకు కావాల్సిన అన్ని రకాల వసతులను శాశ్వత ప్రాతిపదికన నిర్మించినట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తరపున వివిధ శాఖల అధికారులకు, టీటీడీ తరపున ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వాటిని సమన్వయంతో పూర్తి చేసి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఏప్రిల్ 15వ తేదీ లోపు శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ విజయరామరాజు.
భక్తుల సౌకర్యార్థం ఎపిఎస్ ఆర్టిసి ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద గ్యాలరీలు, పటిష్టమైన బ్యారికేడ్లు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయలన్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.