కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తెలంగాణ రాములమ్మగా పేరుగాంచిన విజయశాంతి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళను కలిశారు. వారిద్దరి భేటీ జరిగినట్టు శనివారం జైలు అధికారులు ధ్రువీకరించారు. సుమారు గంటపాటు వారిద్దరు సమావేశం అయ్యారు. ముఖ్యంగా రాజకీయ పరమైన అంశాల మీదే వారి భేటీ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకే విజయశాంతి.. శశికళను కలిసినట్టు భావిస్తున్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే నుంచి శశికళ, టీటీవీ దినకరన్ను బహిష్కరించడంతో వారిద్దరూ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం అనే పేరుతో కొత్త పార్టీ పెట్టారు. దానికి టీటీవీ దినకరన్ జనరల్ సెక్రటరీ. జయలలిత మరణం తర్వాత జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో కుక్కర్ గుర్తు మీద పోటీ చేసి గెలిచారు దినకరన్.
జయలలిత కుటుంబంతో విజయశాంతికి సత్సంబంధాలే ఉన్నాయి. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్లి కలిసేవారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఒకటి రెండు సార్లు శశికళను కలిసి పరామర్శించారు. ఇప్పుడు మరోసారి శశికళను కలవడం కచ్చితంగా రాజకీయాలపై చర్చించేందుకే అని భావిస్తున్నారు.
తమిళనాట ఇప్పటికే డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ స్నేహం కొనసాగిస్తోంది. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఏకంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. మరోవైపు జయలలిత, కరుణానిధి కుటుంబాల మధ్య ఉన్న వైరం ఈ నాటిది కాదు. ఆ విషయం అటు శశికళకు, ఇటు స్టాలిన్కు కూడా తెలియందేం కాదు. ఈ రెండు కత్తులను ఒకే ఒకలోకి ఎలా తీసుకురాగలరు అనేదే ప్రశ్న. మరోవైపు తమ సత్తా చూపించడానికి మరో అడుగు ముందుకు వేసింది ఏఎంఎంకే. అన్నిటికంటే ముఖ్యంగా కరుణానిధి మరణం తర్వాత ఏర్పడిన తిరువారూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో డీఎంకేతో తలపడేందుకు ఏఎంఎంకే సిద్ధమైంది. ఆ పార్టీ తరఫున కామరాజ్ అనే వ్యక్తిని బరిలో నిలుపుతున్నారు. బద్ధ శత్రువుల్లాంటి ఈ ఇద్దరినీ ఒకే తాటి మీదకు తీసుకురావడం సాధ్యమవుతుందా అనే ప్రశ్న రాజకీయవర్గాల్లో నెలకొంది.