ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాబ్ వచ్చిందని ఆఫర్‌ లెటర్‌తో ఐటీ కంపెనీకి వెళ్లిన యువకులు.. అక్కడ ఊహించని ట్విస్ట్, తీరా ఆరా తీస్తే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 07:33 PM

తిరుపతి జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరుతో ఇద్దరు వ్యక్తులు యువకుల్ని మోసం చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నానంటూ నమ్మించి ఏకంగా రూ.లక్షల్లో వసూలుచేసి నిండా ముంచేశారు. చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీకి చెందిన పాశం గురుప్రసాద్‌, అతడి సమీప బంధువు బి.రెడ్డెప్పలు నిరుద్యోగులకు రూ.50 లక్షల వరకు టోకరా వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


పాశం గురుప్రసాద్‌ తాను ప్రముఖ కంపెనీల్లో హెచ్‌ఆర్‌ మేనేజరుగా పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపుకార్డుతో ఫేస్‌బుక్‌ ద్వారా నిరుద్యోగులను పరిచయం చేసుకునేవాడు. ప్రముఖ కంపెనీల పేరుతో నిరుద్యోగులకు ఫేక్‌ ఆఫర్‌ లెటర్స్‌ పంపించారని.. సమీప బంధువైన రెడ్డెప్ప ప్రధాన నిందితుడికి సహకరించాడని బాధిత యువకులు ఆరోపిస్తున్నారు. వాటిని పట్టుకుని యువకులు కంపెనీలకు వెళ్లడంతో అసలు విషయం బయటపడిందంటున్నారు. వీరంతా ఫోన్‌పే, గూగుల్‌పేల ద్వారా నుంచి డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్నారు.


ఈ ఇద్దరు కలిసి మోసం చేసిన వారిలో హైదరాబాద్, వినుకొండ, మాచర్ల, తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన 12 మంది బాధితులు ఇప్పటివరకు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. మరింతమంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు రూ.1.50 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఒక్కో నిరుద్యోగ అభ్యర్థి నుంచి వసూలు చేయగా సోమవారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన స్పందనలోనూ బాధితులు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఇదివరకే చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో ఛీటింగ్‌ కేసు నమోదవడంతో నిందితులు ఇద్దరూ సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి అందుబాటులో లేకుండాపోయారు. చంద్రగిరి పోలీసులు ఈ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com