ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై సెటైర్లు,,,కోడిగుడ్డు అవార్డును ఇస్తున్నానంటూ లోకేష్ సెటైర్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 07:25 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పంచ్ డైలాగులు, ప్రాసలతో హోరెత్తుతున్నాయి. నాయకులు అందరూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ పాలిటిక్స్‌ను రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఓ గిఫ్టు పంపించారు. అయితే ఆ గిఫ్టు వెనుక కూడా ఓ సెటైర్ ఉంది మరి. అలా గిఫ్టు పంపుతూనే మంత్రి పరువు తీసే ప్రయత్నం చేశారు నారా లోకేష్.


శంఖారావం యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న నారా లోకేష్.. తాజాగా అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ మంత్రి అమర్‌నాథ్‌కు కోడిగుడ్డును అవార్డుగా ఇస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన అమర్‌నాథ్‌కి దీనిని బహుమతిగా పంపుతున్నానని అన్నారు.


"అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం పరువు తీసినందుకు ఐటీ మంత్రికి కోడిగుడ్డు అవార్డును ఇస్తున్నా. అమర్‌నాథ్ అన్నకు ఈ అవార్డు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. అందుకే జాగ్రత్తగా డెలవరీ చేయమని చెబుతున్నా. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమరనాథ్..చాలా అదృష్టవంతుడు. చిన్నవయసులోనే పరిశ్రమల శాఖ మంత్రి అయ్యాడు. మంత్రిగారి నియోజకవర్గమంటే ఎలా ఉండాలి? అదో కంచుకోటలా ఉండాలి. ఎటు చూసినా రోడ్లు ఉండాలి. ఎవరైనా ఉద్యోగం అడిగితే ఫలానా కంపెనీకి వెళ్తే ఉద్యోగం వస్తుందని లెటర్ ఇచ్చేలా ఉండాలి. నేను ఈ సభ వేదికగా అడుగుతున్నా. మీ నియోజకవర్గంలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించావా అని ప్రశ్నిస్తున్నా. మీరు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను అయినా తెచ్చారా అని అడుగుతున్నా" అని లోకేష్ ప్రశ్నించారు.


ఇక ఇదే సభలోనే మంత్రి అమర్‌నాథ్ మీద నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ భూములను కబ్జాచేశారనీ, గ్రావైల్ దోపిడీ జరుగుతోందని అన్నారు. ప్రజల నుంచి తక్కువ ధరకు భూములు కొని ప్రభుత్వానికి అమ్మేసి సొమ్ము చేసుకున్నారంటూ విమర్శలు చేశారు. ఈ రకంగా వందలకోట్లు జేబులో వేసుకున్నారంటూ నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు గతంలో ఏపీలో ఐటీ అభివృద్ధిని ఉద్దేశిస్తూ మంత్రి అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీలో ఐటీ అభివృద్ధి గుడ్డు దశలో ఉందని, త్వరలోనే పొదుగుతుందంటూ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. మంత్రి వ్యాఖ్యలపై మీమ్స్, ట్రోల్స్ రావటంతో.. దానిని ఉద్దేశిస్తూనే నారా లోకేష్ ఇలా గుడ్డును బహుమతిగా పంపుతున్నట్లు సెటైర్లు పేల్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com