ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.18,750

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 20, 2024, 07:18 PM

ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. మహిళల సమగ్రాభివృద్ధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా చేపట్టిన వైఎస్సార్‌ చేయూత పథకం. 2020 ఆగస్టు 12న ప్రారంభించిన ఈ పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున అందజేస్తోంది. ఇలా నాలుగు దఫాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారు స్వశక్తిపై ఎదిగేందుకు, సుస్థిరమైన జీవనోపాధి పొందేందుకు తోడ్పాటునందిస్తోంది. వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఇప్పటి వరకూ మూడు విడతల్లో భారీగా నిధుల్ని మహిళలకు అకౌంట్లలో జమ చేశారు.


ఈ పథకానికి సంబంధించిన నిధుల్ని ఈ నెల 16న విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే ఈ నెల 21న వైఎస్సార్ చేయూత నిధుల్ని చిత్తూరు జిల్లా కుప్పంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి మహిళల అకౌంట్‌లలో డబ్బుల్ని జమ చేయనున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు గత మూడేళ్లలో రూ. 666.50 కోట్లను అందజేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు రూ. 478.49 కోట్ల సాయం పొందగా.. పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు రూ. 188.01 కోట్లు అకౌంట్‌లలో జమ చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1.50 లక్షల మంది మహిళలకు రూ. 250 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన మహిళలకి ఆర్థిక వెసులుబాటు కలిగించే ఉద్దేశంతో వైఎస్సార్‌ చేయూత పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి రూ.18,750 అందిస్తున్నారు. ఈ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారికే మాత్రమే. ఈ పథకానికి ధరఖాస్తు చేసుకునేవారికి ఆధార్ కార్డు, రైస్ కార్డు / తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ ఉండాలి.


అలాగే మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.10వేలు.. పట్టణ ప్రాంతంలో అయితే రూ.12 వేలకు మించకూడదు. మొత్తం కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట లేదా మాగాణి మెట్ట రెండు కలిపి పది ఎకరాలకు మించకూడదనే నిబంధన ఉంది. కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు.. ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు అనర్హులు. కుటుంబం నివసిస్తున్న ఇంటి కరెంట్ బిల్ 300 యూనిట్లకు లోబడి ఉండాలి. పట్టణ ప్రాంతంలో సొంత ఇంటి కోసం స్థలం ఉన్నట్లయితే అది 750 చదరపు గజాల లోపు ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆదాయ పన్ను చెల్లించే వారు ఉండకూడదు..కుటుంబంలో ఎవరికీ నాలుగు టైర్ల వాహనాలు ఉండకూదు.


వైఎస్ఆర్ చేయూత పథకానికి గ్రామ, వార్డు సచివాలయంలో మాత్రమే దరఖాస్తు చేయొచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు పైన తెలిపిన పత్రాలను గ్రామ వాలంటీర్‌కు అప్లికేషన్ జతచేసి అందజేయాలి. ఆ అప్లికేషన్‌ను అర్హులుగా జాబితాల చేరుస్తారు. ఆ తర్వాత సర్వే చేసి అర్హుల జాబితాను ఫైనల్ చేస్తారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com