న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ను దోషిగా తేలుస్తూ ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. డిసెంబరు 31లోగా సజ్జన్ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని దివంగత ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్యక్తిగత భద్రతాసిబ్బంది కాల్చి చంపిన విషయం విదితమే. ఆ మర్నాడు దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి గతంలో పలు కేసులు నమోదయ్యాయి. అప్పటి అల్లర్లలో ఢిల్లీలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని హత్య చేశారు. ఈ ఘటనలో సజ్జన్తో పాటు మరికొంతమందిపై కేసు నమోదైంది. దీనిపై గతంలో విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు నిందితులైన బల్వన్, భగ్మల్, గిర్ధారీలను దోషులుగా తేలుస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా సజ్జన్ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే సజ్జన్ను నిర్దోషిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు ఢిల్లీ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. మరోవైపు ఈ కేసులో సీబీఐ కూడా అప్పీల్ చేసింది. వీటిపై విచారణ జరగిన నేపధ్యంలో హైకోర్టు సజ్జన్ను దోషిగా నిర్ధారించింది.