ప్రేమ పెళ్లి చేసుకున్న క్రీడాకారుల జాబితాలో మరో జంట చేరబోతోంది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్లు నేడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు నేడు అత్యంత సాధారణంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఇరు కుటుంబాల ఇళ్ల వద్ద ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. కశ్యప్ ఉపనయన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన దగ్గరి బంధువులు, సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరు కానున్నారు. నేడు వివాహం చేసుకోనున్న సైనా-కశ్యప్ జంట ఈ నెల 16న వివాహ విందు ఇవ్వనున్నారు. దీనికి ప్రముఖ క్రీడాకారులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.