గోవా రాజకీయాలు వేడెక్కాయి. గోవాలో సీఎం పీఠం కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గవర్నర్ను కలిసిన మనోహర్ పారికర్ ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించగా త్వరలో సీఎల్పీ నేతను ఎన్నుకుని గవర్నర్ దగ్గరికి వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇతర పార్టీలకు చెందిన 10 మందిలో 9 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే మద్దతివ్వడంతో గోవాలో అధికారంపై బీజేపీ ధీమాగా ఉంది. గోవా గవర్నర్ మృదులా సిన్హాను గడ్కరీతో కలిసి పారికర్ తమకు మద్దతిచ్చే ఇతర పార్టీ ఎమ్మెల్యేల వివరాలను అందించారు. తగినంత సఖ్యాబలం ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పారికర్ కోరారు. 13 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు తమకు మద్దతిస్తున్న ముగ్గురు ఎంజీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు గోవా ఫార్వార్డ్ పార్టీ ఎమ్మెల్యేలు, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో పారికర్ గవర్నర్ దగ్గరికి వెళ్లారు. 22 మంది సంతకాలతో ఉన్న లేఖను సిన్హాకు అందించారు. అదనంగా 9 ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీకి అవసరమైన బలం దక్కినట్టు అవుతుంది. గతంలోనూ గోవా ముఖ్యమంత్రిగా పారికర్ పనిచేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర కేబినెట్లో చేరారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పారికర్ స్థానంలో పర్సెకర్ను గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నియమించింది. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పర్సేకర్ కూడా ఓడిపోవడం బీజేపీలో కలకలం రేగింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ ఇతర పార్టీల మద్దతు కూడగట్టింది. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల అభిష్టం మేరకు మళ్లీ పారికర్ నే ముఖ్యమంత్రిగా నియమించబోతోంది. అధిష్టానం నిర్ణయనికి పారికర్ ఓకే చెప్పడంతో ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నిక ఖరారైంది.