అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆస్తులను ప్రకటించారు. ఇప్పటివరకు ఏడు సార్లు ఆస్తులను ప్రకటించిన చంద్రబాబు ఎనిమిదవసారి కూడా ఆస్తులను ప్రకటించారు.వరుసగా ఎనిమిదోసారి చంద్రబాబు కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తుల వివరాలను వెల్లడించారు. చంద్రబాబు కుటుంబసభ్యుల మొత్తం ఆస్తి రూ.88.66 కోట్లుగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్థి 29.9 కోట్లు, నారా భువనేశ్వరి ఆస్థి 31.01, నారా లోకేష్ 21.40, నారా బ్రాహ్మణి ఆస్థి 7.72, నారా దేవాన్ష్ 18.71గా ప్రకటించారు. హైదరాబాద్ లోని తన నివాసం 8 కోట్లు కాగా.. నారావారిపల్లెలో ఉన్న నివాసం 23.83గా ప్రకటించారు. రాజకీయాల్లో నేతలు ప్రజలకు జవాబుదారీతనం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆస్తులను ప్రకటిస్తున్నామన్న లోకేష్ ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా ప్రకటించామని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆస్తులను ప్రకటిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 88.66 కోట్లుగా మంత్రి లోకేష్ ప్రకటించారు. కాగా, నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తులు రూ.6.83 కోట్లు అని, హెరిటేజ్ సంస్థ నికర లాభం రూ.60.38 కోట్లుగా లోకేశ్ ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ 13 కోట్లకు పైగా పెరిగింది.