న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. మాజీ కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రి భార్య జాకియా జాఫ్రి వేసిన పిటిషన్ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ నెల 19న దీనిపై విచారణ చేపట్టనుంది. గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండలో మోదీకి ఇచ్చిన క్లీన్చిట్ను సవాలు చేస్తూ గతేడాదే జాకియా జాఫ్రీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. దానిని ధర్మాసనం నిరాకరించింది. 2002, ఫిబ్రవరి 28న గుల్బర్గ్ సొసైటీలో జరిగిన దాడిలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రి సహా మొత్తం 68 మంది మృత్యువాత పడ్డారు.
జాఫ్రి ఆరోపణలపై విచారణ జరపడానికి మార్చి 2008లో సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసింది. 2010లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మోదీని సిట్ 9 గంటల పాటు విచారించింది. ఆ తర్వాతి కాలంలో మోదీకి పూర్తిగా క్లీన్చిట్ ఇచ్చింది. మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని సిట్ తేల్చింది. 2012లో మెట్రోపాలిటన్ కోర్టులో జాఫ్రి ఈ క్లీన్చిట్ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దాడి వెనుక కుట్ర కోణంలో దర్యాప్తు జరపాలని జాఫ్రి కోరారు. అయితే 2013 డిసెంబర్లో కోర్టు సిట్ క్లీన్చిట్నే ఆమోదించింది. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టు కూడా గతేడాది జులై 3న మోదీకి క్లీన్చిట్ ఇచ్చింది.