హమాస్ ముష్కరుల మెరుపు దాడితో ఇజ్రాయేల్ ఉక్కిరిబిక్కిరయ్యింది. 20 నిమిషాల వ్యవధిలో వేలాది రాకెట్లు దూసుకురావడంతో ఏం జరగుతుందో తెలియక అయోమయానికి గురైన ఇజ్రాయేల్.. వెంటనే తేరుకుని ఎదురుదాడికి దిగింది. యుద్ధాన్ని తాము కోరుకోలేదని, హమాస్ ప్రారంభించిన యుద్ధాన్ని మేము ముగిస్తామని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఉద్ఘాటించారు. అంతేకాదు, తామేంటో చూపిస్తామని, ఈసారి కొట్టే దెబ్బ తమ శత్రువులు దశాబ్దాలు పాటు గుర్తుంచుకుంటారని ఆయన ప్రకటించారు.
ఇక, హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయేలీలు స్వచ్ఛందంగా దేశం కోసం కదన రంగంలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయేల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది. వీరిలో ఇజ్రాయేల్కు చెందిన ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ కూడా ఉన్నారు. యుద్ధానికి బయలుదేరే ముందు తన భార్యను హత్తుకున్న ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన ఆయన.. ఆమెకు వీడ్కోలు చెబుతూ భావోద్వేగ పోస్టు పెట్టారు. తాను యుద్ధరంగంలో ఉన్నప్పుడు తన సోషల్ మీడియా ఖాతాను భార్య ఇండియా నఫ్తాలీ నిర్వహిస్తుందని తెలిపారు.
‘‘నా దేశం ఇజ్రాయేల్ రక్షణకు.. సేవ చేసేందుకు వెళ్తున్నాను.. నా భార్య ‘ఇండియా నఫ్తాలీ’కు వీడ్కోలు చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది.. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’’ అని రాసుకొచ్చారు. అనంతరం మరో వీడియోను పోస్ట్ చేసిన హనన్య నఫ్తాలీ.. ‘తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు.. తమ ఇళ్లను, కుటుంబాలను రక్షించుకోడానికి’ అని ఆయన పేర్కొన్నారు.
హనన్య నఫ్తాలీ భార్య.. ఇండియా నఫ్తాలీ కూడా జర్నలిస్టే. తన భర్త పోస్ట్ను షేర్ చేసిన ఆమె.. యుద్ధానికి వెళ్తోన్న నా భర్త క్షేమంగా రావాలని ప్రార్ధించమని కోరింది. భార్యాభర్తలు ఇరువురూ సరిహద్దుల్లో ఉంటూ ఇజ్రాయేల్ హమాస్ యుద్ధాన్ని కవర్ చేస్తున్నారు. ఓ బాంబు షెల్టర్లో నఫ్తాలీ-ఇండియా ఇద్దరూ ఉన్న వీడియో వైరల్ అయింది. రాకెట్ సైరన్ విని నిద్రలేచిన తాము... బాంబు షెల్టర్లోకి పరుగెత్తామని నఫ్తాలీ చెప్పారు. రోజంతా బాంబుల మోత మోగుతూనే ఉందని తెలిపారు.
శనివారం నుంచి రిజర్వు బలగాలను సిద్ధం చేస్తున్నామని, 3 లక్షల మంది వాలంటీర్గా వచ్చారని ఇజ్రాయేల్ సైనిక అధికార ప్రతినిధి తెలిపారు. తాను తిరిగొస్తానని మాటిచ్చి.. కుమారుడికి వీడ్కోలు చెబుతోన్న ఓ తండ్రి ఫోటోను ఇజ్రాయేల్ రక్షణ శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇజ్రాయేల్లో 18 ఏళ్ల నిండిన యూదు, డ్రూజ్ లేదా సిర్కాసియన్ ప్రతి పౌరుడు సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది. అయితే, ఇజ్రాయేలీ అరబ్బులు, మతపరమైన మహిళలు, వివాహితులు, మానసికంగా లేదా వైద్యపరంగా అనర్హులుగా భావించే వారికి నిర్బంధ సేవ నుంచి మినహాయింపు ఉంది.