ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఒక్క రాష్ట్రంలోనే 50 వేల పెళ్లిళ్లకు ఎఫెక్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 10:17 PM

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం శాసన సభల పదవీ కాలం పూర్తి కానుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలను కూడా ప్రకటించింది. ఇక దసరా తర్వాత దీపావళి సమయంలో మంచి రోజులు ఉండటంతో పెళ్లిళ్ల సీజన్ రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వివాహాలకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో ముందుగా నిశ్చయం అయిన వాళ్లంతా అదే సమయంలో పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. తాజాగా సోమవారం ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలు విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయితే ఆంక్షలు ఉన్నప్పటికీ.. పోలింగ్ తేదీన భారీగా పెళ్లిళ్లు ఉండటంతో అటు.. పెళ్లి చేసుకునేవారితోపాటు ఎన్నికల సంఘానికి కూడా కొత్త తలనొప్పి తయారైంది.


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్‌ 23 వ తేదీన జరగనుంది. అయితే అదే రోజు దేవ్ ఉథాని ఏకాదశి కావడం గమనార్హం. నవంబర్ 23 వ తేదీన రాజస్థాన్‌ వ్యాప్తంగా 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎన్నికల పోలింగ్, కోడ్ ఆంక్షలతో పెళ్లిళ్లు చేసుకునేవారితోపాటు వాటికి హాజరయ్యేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు.. ఇలా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో ఓటింగ్ శాతంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దేవ్ ఉథాని ఏకాదశి వివాహాలకు అత్యంత అనువైన రోజు అని.. అందుకే ఆ రోజు పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని పండితులు చెబుతున్నారు.


ఇక 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల కోసం మొత్తం 51,756 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. అయితే అన్ని పోలింగ్ స్టేషన్‌లలో 75 శాతం ఓటింగ్‌ నమోదయ్యేలా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపడుతోంది. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో 74.71 శాతం ఓటింగ్ నమోదైంది. హిందువులకు దేవ్ ఉథాని ఏకాదశి సందర్భంగా వివాహాలు చేసుకోవడానికి అత్యంత పవిత్రమైన సందర్భం అని పండితులు పేర్కొంటున్నారు. దీంతో అదే రోజు ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో పెళ్లిళ్లు చేసుకునేవారు, వారి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చూసే వ్యాపారులు కూడా తీవ్రంగా ఇబ్బందిపడే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో టెంట్ డీలర్లు, ఈవెంట్ మేనేజర్‌లతో సహా దాదాపు 4 లక్షల మంది వ్యాపారులు పెళ్లిళ్ల సీజన్‌లో పాల్గొంటారని.. వీరికితోడు క్యాటరింగ్, ఫ్లోరిస్ట్‌లు, బ్యాండ్, డీజే, కొరియోగ్రాఫర్‌లు మొత్తం కలిపితే దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పెళ్లిళ్ల సీజన్‌లో పాల్గొంటారని చెబుతున్నారు.


ఈ క్రమంలోనే పెళ్లిళ్లు చేసుకునేవారు, ఆ పెళ్లిళ్లకు హాజరయ్యేవారు, పెళ్లిళ్లలో పనిచేసే కార్మికులు.. ఈ పనుల్లో బిజీగా ఉంటే.. పోలింగ్ శాతం తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నవంబర్ 23 వ తేదీకి సంబంధించి ఫంక్షన్ హాల్స్, డెకరేషన్, బ్యాండ్, డీజేలను ఇప్పటికే బుక్ అయిపోయాయని.. మార్చుకునే అవకాశం లేదని పెళ్లిళ్లు చేసుకునేవారు చెబుతున్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం రాజస్థాన్‌లో 2.75 కోట్ల మంది పురుషులు.. 2.51 కోట్ల మంది మహిళా ఓటర్లు సహా మొత్తం 5.27 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 22 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com