ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఆర్ జిల్లాలో 144 సెక్షన్ అమలు,,,,ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి పోలీసుల నో పర్మిషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 24, 2023, 06:23 PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు, కస్టడీకి నిరసనగా.. ఐటీ ఉద్యోగులు ఆదివారం రోజు పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన విజయవాడ సీపీ కాంతిరాణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి పర్మిషన్లు లేవని సీపీ తెలిపారు. ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించ తలపెట్టినట్టు సోషల్ మీడియా ద్వారా తెలసిందన్న సీపీ.. ర్యాలీ నిర్వహిస్తే మాత్రం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు సీపీ.


ఇదిలా ఉంటే.. ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద మూడు అంచెల భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. ఇక ఇదే క్రమంలో.. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా రాజమండికి రావాలని ఏటీ ఉద్యోగులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అందుకు తగ్గట్టుగానే బందోబస్తు ఏర్పాటు చేసుతున్నారు.


ఏపీ సరిహద్దులోని గరికపాడు వద్ద నుంచి అనుమంచిపల్లి వరకు 3 పోలీస్‌ అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంటి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి.. అన్ని వివరాలు సేకరించిన తర్వాత.. వాళ్లు ర్యాలీకి కాదని నిర్ధారించుకున్నాకే అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. సుమారు 150 నుంచి 200 మంది పోలీసులను విధుల్లో ఉంచినట్టు సమాచారం.


మరోవైపు.. హైదరాబాద్‌కు కూడా ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు మద్దతుదారులపై పోలీసులు నజర్ వేశారు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమయ్యే చంద్రబాబు సంఘీభావ ర్యాలీపై నిఘా పెట్టారు. ఐటీ ఉద్యోగుల సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులపై కూడా ఆరా తీస్తున్నారు. ORR ర్యాలీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులకు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి ఫోన్లు వెళ్లాయని తెలుస్తోంది. రేపటి ర్యాలీలో ఎవరు పాల్గొనొద్దు అంటూ హెచ్చరికలు కూడా చేసినట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com