ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అది మాదే,,,,మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 09:46 PM

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. సోమవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తమదేనని ఆమె వ్యాఖ్యానించారు.


ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తమదేనని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ బిల్లును పార్లమెంటు ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్న వేళ సోనియా గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంగళవారం ఆమె పార్లమెంటుకు వచ్చిన సమయంలో మీడియా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమెను ప్రశ్నించగా.. అది తమదేనని సమాధానం ఇచ్చారు.


ఇక కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కల్పించారని వార్తలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విటర్‌లో స్పందించారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వేచి చూస్తున్నామని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు ముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చించి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. రహస్యంగా ఇలా తీసుకురావడానికి బదులు.. అన్ని పార్టీలు అంగీకరిస్తున్నందున ఏకాభిప్రాయం వచ్చేది అని అన్నారు.


ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును మంగళవారం కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంటులో ప్రవేశపెడితే అది కాంగ్రెస్, దాని మిత్రపక్షాల విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తెలిపారు. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో 2010 మార్చి 9 వ తేదీన రాజ్యసభలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందగా.. లోక్‌సభలో మాత్రం చర్చకు రాలేదు. అయితే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళ రిజర్వేషన్ల బిల్లు ఎన్నో ఏళ్లుగా నానుతూనే ఉంది. 1996 లో అప్పుడు అధికారంలో ఉన్న హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ముందుగా ఈ మహిళ రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల కాలంలోనూ ఈ బిల్లును ప్రవేశపెట్టినా అది లోక్‌సభలో ఆమోదం పొందలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com