పానాజి : రామాయణంలోని ప్రధాన ప్రతినాయకుడైన రావణాసురుడు ద్రావిడ జాతికి చెందిన వాడు కాదని బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కరుణానిధి భావించినట్లు రావణుడు ద్రావిడ జాతికి చెందడని, రావణుడు నోయిడాలో జన్మించాడని ఆయన చెప్పారు. భారతీయ సంస్కృతి వారసత్వం, దాని ప్రాముఖ్యత అనే అంశంపై సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. దేశ రాజధాని ప్రాంతంలోని నోయిడాలో ఉన్న బిస్రాఖ్ గ్రామంలో రావణాసురుడు జన్మించాడని స్వామి చెప్పారు. రావణాసురుడు లంకనుంచి వచ్చాడని భావిస్తున్నందున అతడిని ద్రావిడ జాతికి చెందిన వాడుగా భావిస్తున్నారని, రావణుడిని హతమార్చినందున ఇక్కడ ప్రజలు రాముడిని ద్వేషిస్తారని ఆయన చెప్పారు. వాస్తవానికి రావణాసురుడు ఢిల్లికి సమీపంలోని బిస్రాఖ్ అనే గ్రామంలో జన్మించాడని ఆయన అన్నారు.