విశాఖపట్నం జిల్లాలోని డుంబ్రిగూడ మండలం లిప్పిట్టిపుట్ట వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు ఆదివారం కాల్చిచంపిన విషయం తెలిసిందే. అరకు ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు ఇవాళ శవపరీక్ష పూర్తయింది. ఎమ్మెల్యే కిడారి మృతదేహాన్ని పాడేరుకు తరలించారు. సివేరి సోమ మృతదేహాన్ని బట్టివలస తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 60 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారని భావిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు గతంలో పలుమార్లు హెచ్చరించారని, ఆయన క్వారీ విషయంలోనూ బెదిరింపులు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలం కిందట టీడీపీలో చేరారు.