నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్దనున్న చెరువు వద్ద రొట్టెలు మార్చుకుని కోరికలు కోరితే అవి నెరవేరుతాయని చాలా కాలం నుంచి ఇక్కడ ప్రతీతి. రొట్టెల పండుగ సందర్భంగా బారాషాహిద్ దర్గాలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ ఈ పండుగను జరుపుకోవడం ఇక్కడి విశేషం. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పండుగ కమిటీ సభ్యులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్ణాల చెరువు ఘాట్లో రొట్టెలు మార్చుకునే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్ వద్ద జల్లుల స్నానాలు ఆచరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. మహిళలు వస్త్రాలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, 120 శాశ్వత మరుగుదొడ్లు, 100 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 2 వేల మంది పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. అలాగే ఘాట్లోని కలుషిత నీటిని బయటకు తరలించేందుకు మోటార్లు ఏర్పాటు చేశారు.