న్యూఢిల్లీ : విదేశాల్లో ఉద్యోగం అనగానే మన కు మొదటగా గుర్తు వచ్చేది అమెరికా పేరే. అయితే, భారతీయులు అత్యధికంగా యూఏఈ లో నివసిస్తున్నారని ప్యూ పరిశోధక కేంద్రం పేర్కొంది. అంతే కాకుండా, అమెరికాలో ఎంత మంది భారత వలసదారులు ఉన్నారో అదే సంఖ్య లో పాక్లోనూ ఉన్నారని తెలిపింది. యూఏఈ లో మొత్తం 35 లక్షల మంది భారతీయులు ఉండగా, పాక్, అమెరికాల్లో 20 లక్షల మంది చొప్పున భారతీయ వలసదా రులు ఉన్నారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో ప్రతి 20 మందిలో ఒకరు మన దేశంలో జన్మించినవారేనని పేర్కొంది. భారత్లో జన్మించినవారిలో సుమారు ఒక శాతం మంది విదేశాల్లో నివసిస్తున్నారని చెప్పింది. కాగా, భారత్ కూడా భారీ సంఖ్యలో వలసదారులకు ఆశ్రయం ఇస్తోందనీ, మన దేశంలో 32 లక్షల మంది బంగ్లాదేశ్ వాసులు, 11 లక్షల మంది పాకిస్తానీలు ఉన్నారని చెప్పింది. అలాగే 5.4 లక్షల మంది నేపాల్ వాసులు, 1.6 లక్షల మంది శ్రీలంక వాసులు వలసదారులుగా ఉన్నారని ప్యూ పరిశోధక కేంద్రం నివేదికలో పేర్కొన్నారు.