రాజమండ్రి :ఈ నెల 10న భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం భయపడి అత్యవసరంగా క్యాబినెట్ లో అబైండ్ మెండ్ బిల్లు పెట్టారని, కేంద్రప్రభుత్వం ఎస్సి,ఎస్టీ హక్కుల కోసం డా.బి.ఆర్ అంబెడ్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు కాల రాయలనుకుంటే తగిన గుణపాఠం చెబుతామని మంత్రి జవహర్ అన్నారు. దళిత, గిరిజనుల హక్కుల సాధనకై రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఐకమత్యంతో మన హక్కులను కాపాడుకుందామన్నారు. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎస్సి,ఎస్టీ చైర్మన్ కారేం శివాజిలు మాట్లాడుతూ దేశంలో 15 నిమిషాలకి దళిత,గిరిజనుల పై దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. దళితుల వర్గాలకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాటమాట్లాడని జగన్మోహన్ రెడ్డి దళితుల, గిరిజన వర్గాల ఓట్లు కావాలని ఎలా అడుగుతున్నాడని ప్రశ్నించారు. దళిత, గిరిజన హక్కుల పరిరక్షణ కై అవసరమైతే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామన్నారు.ఎస్సి,ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడితే కేంద్ర ప్రభుత్వం 12 మందిని బలిగొందని విమర్శించారు.