న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఆ రాష్ట్ర హైకోర్టు గట్టి జలక్ ఇచ్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్ ఇంట్లో ధర్నా చేసేందుకు మీకెవరు అధికారం ఇచ్చారని హైకోర్టు సీఎం కేజ్రీని ప్రశ్నించింది. గత వారం రోజులుగా కేజ్రీతో పాటు ఆయన క్యాబినెట్లోని ముగ్గురు మంత్రులు గవర్నర్ ఇంట్లో ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. ఐఏఎస్ అధికారులు పనిచేయడం లేదని, ప్రధానితో పాటు గవర్నర్ కూడా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేజ్రీ ధర్నా చేస్తున్నారు. అయితే దీనిపై ఇవాళ రెండు పిటిషన్లు కోర్టు ముందుకు వచ్చాయి. ఒకటి ఆమ్ ఆద్మీ నేత కేజ్రీ వేయగా, మరొకటి ఐఏఎస్ల సంఘం వేసింది. మీకు గవర్నర్ ఇంట్లో ధర్నా చేసే అధికారం ఎవరు ఇచ్చారు. ఒకవేళ మీరు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే, అది ఆఫీసు బయట చేయాలని, కానీ ఒకరి ఇంట్లోకి వెళ్లి ఎలా ధర్నా చేస్తారని కోర్టు ప్రశ్నించింది. కేజ్రీ ధర్నా నేటితో 8వ రోజుకు చేరుకున్నది. అయితే మరో వైపు ఐఏఎస్ల సంఘం మాత్రం మరో వాదన వినిపిస్తున్నది. రాజకీయ లాభం కోసం తమను వేధిస్తున్నారని ఐఏఎస్లు ఆరోపిస్తున్నారు. దీక్ష చేస్తున్న మంత్రి సత్యేంద్ర జైన్ అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను హాస్పటల్కు తరలించారు.