ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 08:08 PM

దోమల ప్రాణాలు  ఏమో గానీ మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అవును.. నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఈ హృదయ విదారక ఘటన దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) శాస్త్రి నగర్ పార్క్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఏడాదిన్నర వయసు గల ఒక చిన్నారి ఉన్నారు. రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో దోమలు కుట్టకుండా ఉండేందుకు పెట్టుకున్న మస్కిటో కాయిల్ నుంచి విడుదలైన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చడం వల్ల కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఊపిరాడక నిద్రలోనే స్పృహ కోల్పోయారు. తెల్లారేసరికి విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని వారందరినీ ఆస్పత్రికి తరలించగా.. వారందరూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


ప్రమాదం జరిగిన సమయంలో గదిలో మొత్తం 9 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పొగ పీల్చుకోవడం వల్ల స్పృహ కోల్పోయిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ‘రాత్రి పూట వారు గది తలుపులు, కిటికీలు మూసి వేసి, మస్కిటో కాయిల్ వెలిగించారు. దీంతో గదిలో రాత్రంతా పొగ కమ్ముకుంది. కార్బన్ మోనాక్సైడ్ బయటకి వెళ్లే దారిలేక గదిలోనే పరుచుకుపోయింది. వారందరూ ఆ విషపూరిత వాయువును పీల్చడం వల్ల మృతి చెందారు’ అని ఢిల్లీ ఈశాన్య జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.


కాలిపోతున్న మస్కిటో కాయిల్ వారు నిద్రిస్తున్న పరుపుపై పడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పొగ కమ్ముకొని గది నిండా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రమాద తీవ్రతను పెంచి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత అది వారి మరణానికి దారి తీసి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com