తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దిల్లీలో మాట్లాడిన వెంకయ్య ప్రగతి, రాష్ట్రాభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ ఇలానే కృషి చేయాలని సూచించారు. అన్ని రాష్ట్రాల సహకారంతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం ఇద్దరూ అవసరమైనప్పుడు కలిసి సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకుని వాటిని పరిష్కరిస్తారని, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో సరైన అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని వెంకయ్యనాయుడు కోరారు.