ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ భుజాలకు గాయం.... సెల్పీలకు దూరంగా యువనేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2023, 08:05 PM

తన భుజాలకు గాయమైన నేపథ్యంలో పార్టీ నేతలకు  సెల్పీలు ఇచ్చేందుకు  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్ ఆసక్తిచూపలేదు. ఇదిలావుంటే  నారా లోకేష్ యువగళం పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి 46వ రోజు ప్రారంభమైంది. అయితే ఇవాళ పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బందిపడుతూ కనిపించారు. ఆయన భుజాలకు గాయాలైనట్లు తెలుస్తోంది. రోజూ లోకేష్ పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం ఉంటుంది. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి లోకేష్ సెల్ఫీ దిగుతున్నారు. అయితే ఇవాళ మాత్రం ఆయన సెల్ఫీలు తీయలేదు.


లోకేష్ రెండు భుజాలకు గాయం కారణంగా సెల్ఫీలు కూడా తీయలేకపోయారని చెబుతున్నారు. ఆయనకు వీలుకాకపోవడంతో ఇతరుల సహాయంతో లోకేష్ సెల్ఫీలు తీయించారు. అలాగే పాదయాత్రలో కూడా భుజాలు లేపి ప్రజలకు అభివాదం చేసేందుకు కాస్త ఇబ్బందిపడుతూ కనిపించారు. అయితే భుజాలకు గాయాలైనా, ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది.


లోకేష్‌ భుజాలకు గాయాలు కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. యువగళం పాదయాత్ర శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముగించుకుని.. ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో లోకేష్‌కు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే కార్యకర్తల ఒత్తిడిలో లోకేష్ భుజాలకు గాయమైనట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం మాత్రం లేదు. కొంతమంతి తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చించుకుంటున్నారు.


చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం తర్వాత పాదయాత్ర మొదలైంది. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. లోకేష్‌ను బలిజ సామాజిక వర్గీయులు కలిశారు. టి.సదుం గ్రామానికి చెందిన వీరు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. విద్య, ఉద్యోగాల్లో గత ప్రభుత్వం కాపు/బలిజలకు ప్రతిపాదించిన 5శాతం రిజర్వేషన్ ను అమలుచేయాలని కోరారు. బలిజలు వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు అందించి ప్రోత్సహించాలన కోరారు.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కాపులు, బలిజలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు లోకేష్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ సీనియర్ నేతలు నిమ్మకాయల చినరాజప్ప, బోండా ఉమ వంటి వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించారన్నారు. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి కాపుల సంక్షేమానికి 5ఏళ్లలో రూ.3,100 కోట్లు ఖర్చుచేశామన్నారు. వైఎస్సార్‌సీప ప్రభుత్వం వచ్చాక కాపు కార్పొరేషన్ ను నిర్వీర్యంచేసి తీరని ద్రోహం చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులు,బ‌లిజ‌ల‌కు అండగా నిలబడి న్యాయంచేస్తామన్నారు.


మరోవైపు గంగసానిపల్లిలో లోకేష్‌ను టమోటా రైతులు కలిసి తమ సమస్యల్ని చెప్పుకున్నారు. కదిరి నియోజకవర్గంలో రైతులు ఎక్కువగా టమోటా పంట సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారని.. ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుచేసి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేల పరిహారం అందించాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక రైతాంగం వెన్నెముక విరిచేశారన్నారు లోకేష్.


రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధితో రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని నట్టేట ముంచారని.. జగన్ చేతగానితనం కారణంగా టమోటాకి కనీస ధర లేక రాయలసీమ రైతులు రోడ్లపై పారబోయాల్సిన దుస్థితి కల్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని.. గతంలో అందించిన రాయితీలన్నింటినీ పునరుద్దరిస్తామన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com