విజయనగరం : ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్తో ఉన్నా సంక్షేమ పథకాలు ఆగలేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయిల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పలు కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన గత నాలుగేళ్లలో 17 వేల కిలోమీటర్ల సిసి రహదారులు నిర్మించామని ఆయన చెప్పారు. వందశాతం సిసి రహదారుల నిర్మాణం లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని ఆయన చెప్పారు. 2019 నాటికి విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో డంప్ యార్డులు పూర్తి చేసే బాధ్యత తమదని ఆయన చెప్పారు.