ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. తొలుత ఐదుగురు ఎంపీలు దీక్షలో కూర్చోగా మేకపాటి, వరప్రసాద్, సుబ్బారెడ్డిలను ఇంతకు ముందే పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే మిథున్, అవినాష్ రెడ్డిలు మాత్రం గత ఆరు రోజులుగా నిరవధిక దీక్షలో ఉన్నారు. వారి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పినా దీక్ష విరమణకు ససేమిరా అన్నారు. కొద్ది సేపటి కిందట వైద్యులు మరోసారి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సుగర్ లెవెల్స్ పడిపోయాయని చెప్పడంతో పోలీసులు వారిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో గత ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైకాపా ఎంపీలు మిథున్, అవినాష్ రెడ్డిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వారి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్పడంతో పోలీసులు బలవంతంగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద ఉన్న వైకాపా శ్రేణులు వారిని తరలిస్తున్న అంబులెన్సులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఏపీ భవన్ వద్ద కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వాహనాలను అడ్డుకున్న వారిని చెదరగొట్టి ఎంపీలను ఆసుపత్రికి తరలించారు.