లక్నో : దేశంలో దళితులకు, వెనుకబడిన వర్గాల వారికి అమలు చేస్తున్న రిజర్వేషన్లను తొలిగించేందుకు కుట్ర జరుగుతున్నదని, వాటిపట్ల తమ ప్రభుత్వం మౌనం వహిస్తున్నదని బీజేపీకి చెందిన బహ్రెయిచ్(యూపీ) ఎంపీ సావిత్రీ బాయి ఫూలే విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వారి చర్యను నిరసిస్తూ ఏప్రిల్ ఒకటిన లక్నోలో భారీ ర్యాలీ నిర్వహిస్తానని ప్రకటించారు. విలేకరులతో ఆమె బుధవారం మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను సమీక్షించాలని నిరంతరం చర్చ జరుగుతున్నది. ఇది రిజర్వేషన్లను అంతమొందించేందుకు జరుగుతున్న కుట్ర. ఈ కుట్రకు వ్యతిరేకంగా గత ఏడాది బహ్రెయిచ్లో ప్రదర్శన నిర్వహించాం. ఏప్రిల్ ఒకటిన ఆరక్షణ్ బచావో (రిజర్వేషన్లను కాపాడండి) నినాదంతో లక్నోలోని కాన్షీరాం స్మృతి ఉపవన్లో ప్రదర్శన నిర్వహిస్తాం అని చెప్పారు. రిజర్వేషన్లను తొలిగించే ఎటువంటి ప్రయత్నాన్నైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఫూలే హెచ్చరించారు. పార్టీ తనకు మద్దతునివ్వకపోయినా బీసీల కోసం పని చేయడం ఆపబోనని స్పష్టం చేశారు.