చెన్నైః జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన 75 రోజులూ అక్కడి సీసీటీవీ కెమెరాలు స్విచాఫ్ చేశామని హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్రెడ్డి చెప్పారు. అపోలో ఇంటర్నేషనల్ సింపోజియం 2018లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత మృతి కేసులో ఆర్ముగస్వామి కమిషన్కు అన్ని పత్రాలు అందించామని ఆయన చెప్పారు. ఈ సమయంలోనే మరి సీసీటీవీ ఫుటేజీని ఇచ్చారా అని ప్రశ్నించగా.. క్షమించండి.. దురదృష్టవశాత్తు ఆ 75 రోజులూ ఆసుపత్రిలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను వాళ్లు ఆఫ్ చేశారు. జయలలితను అడ్మిట్ చేయగానే ఐసీయూలోకి ఎవరూ వెళ్లకుండా మూసేశారు. మిగతా పేషెంట్లందరినీ మరో ఐసీయూలోకి తరలించారు. 24 బెడ్లు ఉన్న ఈ ఐసీయూలో ఆమె మాత్రమే ఉన్నారు. ఎవరూ చూడకూడదన్న ఉద్దేశంతో వాళ్లు సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశారు అని ప్రతాప్రెడ్డి వెల్లడించారు. ఆమెను కలవడానికి ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. ఆసుపత్రిలో మేం ఫాలో అయ్యే విధానం ఒకటే.. ఐసీయూలోకి మరీ సన్నిహితులను తప్ప ఎవరినీ అనుమతించం. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఎవరినీ అనుమతించలేదు అని ప్రతాప్రెడ్డి స్పష్టంచేశారు. ఆమెను బతికించడానికి ఆసుపత్రి శాయశక్తులా కృషి చేసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. కమిషన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆసుపత్రి తరఫున వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతాప్రెడ్డి తెలిపారు.