న్యూఢిల్లీ : సమస్య పరిష్కారం ఉద్దేశమే కేంద్రానికి లేనట్టుగా ఉందని తెలుగుదేశం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయన అవిశ్వాస తీర్మానానికి ఎంత మంది ఎంపీలు మద్దతు తెలుపుతున్నారో లెక్కించడం పెద్ద కష్టం కాదని ఆయన అన్నారు. అయితే అందుకు స్పీకర్ సుముఖంగా లేరన్నారు. మరో మార్గ మేమిటంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మద్దుత విషయంపై ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుందని, అయితే స్పీకర్ అందుకు సుముఖంగా లేరని సుజనా చౌదరి అన్నారు. అవిశ్వాసంపై చర్చ జరగాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అయితే స్పీకర్ తీరు బాధాకరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అనేది చాలా చాలా బాధాకరమని అన్నారు. స్పీకర్ గారు నిజంగా అవిశ్వాస తీర్మానాన్నిచర్చకు చేపట్టాలనుకుంటే వెల్ లో ఉన్న వారిని సస్పెండ్ చేసి చేయవచ్చుకద, పునర్విభజన బిల్లు సమయంలో మీరాకుమార్ గారు వెల్ లో ఉన్నవారిని సస్పెండ్ చేసి బిల్లు పాస్ కావడానికి అవకాశం ఇచ్చారుకదా అని సుజనా చౌదరి అన్నారు. అవిశ్వాస తీర్మానం అనేది చాలా అరుదుగా వస్తుంది, దానిని చేపట్టాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందని సుజనా చౌదరి అన్నారు.