అమరావతి: కేంద్రం ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవర్తన గత కొంత కాలంగా భిన్నంగా ఉందన్నారు. అవిశ్వాసంపై చర్చ చేపట్టకుండా కేంద్రం పదేపదే వాయిదాలు వేస్తోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు అవగాహన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులడిగితే తనపై కేంద్రం ఎదురు దాడి చేయిస్తోందని ఆరోపించారు. పార్టీ ఎంపీలు, మూడు పార్టీలు కలిసి నాపై ముప్పేట దాడి చేస్తున్నాయన్నారు. లోకేశ్, మంత్రులు, పార్టీని టార్గెట్ చేసుకున్నాయని ఆరోపించారు. అయినా రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కక్ష సాధింపు చర్యలు పెరుగుతాయని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. ఎవరికీ హోదా ఇవ్వనంటేనే అప్పుడు ఆర్థిక సహాయానికి అంగీకరించామని, తర్వాత కేంద్రం మాటతప్పిందని అన్నారు. హోదా రాష్ట్రాలకు 90:10 కింద నిధులు కొసాగిస్తోందన్నారు. వేరే రాష్ట్రాలకు ఇచ్చేట్లయితే మనకూ అదేపేరుతో ఇవ్వాలనేది మన డిమాండ్ అన్నారు. మన వాదనలో హేతుబద్దతపై ప్రజలకు వివరించి చైతన్య పరచాలన్నారు. తొలి ఏడాది నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందని, అందుకే ఇన్నాళ్లూ ఓపికపట్టామని, చేస్తారని ఎదురు చూశామన్నారు.