అమరావతి : అనంతపురం జిల్లాను పారిశ్రామిక, ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురం జిల్లా ఎడారిలా మారుతుందని ప్రచారం చేశారని, ఆ జిల్లాలను సస్యశ్యామలం చేయనున్నామని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ప్రభుత్వ ఆకాంక్ష అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకూ 533 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఈ పరిశ్రమల్లో 2,64,792 మందికి ఉపాధి లభించిందని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలోనూ విస్తృతంగా ఉపాధి అవకాశాలున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో సుస్థిరతపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరి వల్ల నష్టపోతున్నామని ఎపి ముఖ్యమంత్రి చెప్పారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని ఆయన చెప్పారు. చట్టంలో పొందుపరిచిన అంశాలు, ప్రత్యేక హోదాపై సమీక్షించనున్నామని ఆయన అన్నారు. ఈ అంశాలను కనీసం సమీక్షించే స్థితిలో కూడా కేంద్రం లేదని ఆయన చెప్పారు.