ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు హైకోర్టులో ఊరట లభించింది. రచ్చబండ కార్యక్రమంలో అప్పటి మంత్రి వట్టి వసంత కుమార్పై దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో గత నెల భీమడోలు కోర్టు దోషిగా నిర్ధారించి 2 సంవత్సవరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో చింతమనేని భీమడోలు మెజిస్ర్టేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏలూరులోని జిల్లా అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో అప్పీలు చేశారు. దాన్ని విచారించిన సెషన్స్ జడ్జి జైలు శిక్షను నిలుపుదల చేశారు. మెజిస్ర్టేట్ కోర్టు దోషిగా నిర్ధాంచిన అంశంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సెషన్స్ కోర్టు ఆదేశాలపై చింతమనేని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్రెడ్డి వాదించారు. జిల్లా సెషన్స్ జడ్జి జైలుశిక్షను మాత్రమే నిలుపుదల చేశారని, నిర్ధోషిత్వంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు.