చెన్నై: సర్వీస్ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ పాటించిన సంగతి తెలిసిందే. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్లు ఛార్జీలను కాస్త తగ్గించడంతో శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సినిమాలు యథావిధిగా ప్రదర్శిస్తున్నారు. మరోపక్క కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్పీసీ) రంగం సిద్ధం చేసింది. మార్చి 16 నుంచి కొత్త సినిమా విడుదల మాత్రమే కాదు.. షూటింగ్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా నిలిపివేయనుంది. ముఖ్యంగా ఆరు డిమాండ్లతో టీఎఫ్పీసీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించనుంది.