ఒంగోలు: ప్రత్యేక హోదాకు, 14వ ఆర్థిక సంఘానికి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుకు ముందే 2014 మార్చి 2న అప్పటి కాంగ్రెస్ ఏపీకి హోదా ఇవ్వాలని కేబినెట్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. 2015లో ఏర్పడ్డ 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు రాజకీయ చిత్తశుద్ధి, విశ్వసనీయత లేదని విమర్శించారు. ప్రకాశం జిల్లా సంతరావురులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇంకా ఎన్డీఏలోనే కొనసాగడం వెనక ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. రాజీనామా చేయాలనుకున్నప్పుడు ఢిల్లి పెద్దలకు ఫోన్ చేయడమెందుకన్నారు.కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటన పాతదేనని అన్నారు. ఏదో జరిగిందని చంద్రబాబు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని గతంలో బాబు అన్నారని, హోదాతో ఏమీ జరగదని ఆయనే అన్నారని పేర్కొన్నారు. హోదా కావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షకు చంద్రబాబు తలొగ్గడం సంతోషం అని పేర్కొన్నారు.