అమరావతి: ప్రజా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అసెంబ్లిలో ఇవాళ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి పోరాడే పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. విభజనతో నష్టపోయినందున ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని, విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సినవి కేటాయించాలని అడిగామన్నారు. విభజన సమయంలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే వెసులుబాటు ఉంటుందని అడిగామని, మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రానికి తేడా ఉందన్నారు. విభజనతో నష్టపోయినందున కేంద్రం సాయం కోరుతున్నామన్నారు. మూడేళ్లుగా చూస్తే బడ్జెట్ కంటే ఎక్కువగా ఖర్చ పెట్టిన సందర్భాలు లేవన్నారు. తలసరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని, రాజ్యాంగం ప్రకారం రావాల్సిన వాటిపై ప్రభావం ఉండదన్నారు. న్యాయపరంగా రావాల్సిన వాటిపై కేంద్రంపై ఒత్తిడి ఉంటుందన్నారు.