అమరావతి : విభజన కారణంగా అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దెబ్బతిన్న ఏపీ హక్కు ప్రత్యేక హోదా అని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నారు. తామేమీ అదనంగా అడగడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ ప్రశక్తే లేదన్నారు. రాష్ట్రానికి నాబార్డ్ ద్వారానో లేదో మరో విధంగానో ఇవ్వాలని తాను ఎన్నోసార్లు అడిగాననీ అయినా కేంద్రం స్పందించలేదని చంద్రబాబు అన్నారు. కేంద్ర సహాయంలో భాగంగా ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా, బీజేపీ ప్రభుత్వంలోని వస్తే ఏపీకి ప్రత్యేక హోదా మరో ఐదేళ్లు పొడిగిస్తుంది, పన్ను రాయితీలను ఇస్తుంది. వెనుకబడిన జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఉంటుంది అని బీజేపీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పించుకోలేరని అన్నారు. తనకు ఎవరి మీదా వ్యతిరేకత లేదన్నారు. మోడీగారి విధానాలన్నిటికీ తాను దేశం కోసం సహకరించానని చంద్రబాబు చెప్పారు. అయితే విభజన హామీల అమలు కోసం తాను ఇప్పటి వరకూ 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్నారు. అదే సమయంలో మూడు కీలకమైన సందర్భాలలో ఒక రోజు రాష్ట్రమంతా కూడా ప్రత్యేక హోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ప్రధానికి వివరించినప్పుడు రాష్ట్రానికి సంబంధించి విషయాలను నీతి అయోగ్ కు నివేదించారు అని చంద్రబాబు చెప్పారు. పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాని అప్పగించారు. అంతే అంతకు మించి ఇంకేమీ జరగలేదు అని చంద్రబాబు అన్నారు. రెవెన్యూ లోటు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి గవర్నర్ నరసింహన్, కాగ్ రెండూ కూడా ఏపీ రెవెన్యూ లోటును లెక్కగట్టి అది రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పారని, దాని ప్రకారం ఏపీకి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రం లెక్కలు ఇవ్వలేదనడం కూడా సాకులు చెప్పడమేనని అన్నారు. ఇది ప్రభుత్వం అక్కౌంట్లే కాదనీ కాగ్ అక్కౌంట్ కూడా అదేనని చంద్రబాబు చెప్పారు.