అమరావతి: ఏపీకి న్యాయం కోసం కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయబోమని పరోక్ష పద్దతిలో చెబుతోందన్నారు. పరోక్ష విధానంలో లీక్లు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు విభజన హామీల విషంలలో కేంద్ర వైఖరిలో స్పష్టత వచ్చేలా చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే మన పోరాటమని అన్నారు. కేంద్రం చేసిన వాగ్దానాలనే మనం అడుగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలనేదే మన లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను అవమానించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. చట్టంలో ఉన్నవే చేయాలని కోరుతున్నామన్నారు. చట్టంలో ఉన్నవి అమలు చేసేందుకు కాలయాపన ఎందుకని ప్రశ్నించారు. చట్టంలో ఉన్నవి అమలు సాధ్యంకాదని ఎలా చెప్పగలుగుతారన్నారు. ప్రజల మనోభావాలు పట్టనట్లు వ్యవహరించడం మంచిది కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడదామని, ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా మన పోరు ఉద్ధృతం చేద్దామన్నారు.