అనంతపురం : కృష్ణాజిల్లా బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరమని దివాకర్ ట్రావెల్స్ యజమానులు, టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ అన్నారు. అనంతలో మంగళవారం జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రమాద ఘటన వద్ద కల్వర్టు ఉంటే ఇంతగోరం జరిగేది కాదన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు మంగళవారం తెల్లవారుజామున రహదారిపై నుంచి కల్వర్టులో పడింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 20 మంది ప్రయాణికులకు పైగా తీవ్ర గాయలైన విషయం తెలిసిందే. బస్సు కొత్తదని అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై స్పందిస్తూ 'అది మా ఖర్మ... టైమ్ బాగోలేదు' అని చెప్పుకోచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తోందన్నారు. డ్రైవర్ ఆదినారాయణరెడ్డి చనిపోవడంతో పూర్తి వివరాలు తెలియవన్నారు. ప్రైవేట్ బస్సులే కాదు ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రమాదానికి గురవుతాయని చెప్పారు. బస్సు ప్రమాదంపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.