ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. అమరావతిలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు రాష్ట్ర, జిల్లా, గ్రామీణ ఆరోగ్య బులెటిన్ను విడుదల చేశారు. ఐదేళ్లలోపు చిన్నారుల సమగ్ర ఆరోగ్య విషయ సమీకరణకు పలకరింపు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు 21 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. శిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా పలకరింపు పథకం చేపడుతున్నారు. సుమారు 50 లక్షల మంది చిన్నారుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,86,624 ఇళ్లను ప్రత్యేక బృందాలు సందర్శించనున్నారు. పలకరింపు కార్యక్రమం కోసం 57,555 బృందాలు ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ, పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్ శాఖల సహకారంతో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రతి చిన్నారికి వ్యాధినిరోధక టీకాలు అందించడం కార్యక్రమం ఉద్దేశం. అనారోగ్యం ఉంటే తక్షణ చికిత్స అందిస్తారు.