ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ రాష్ర్టమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖ సీఐఐ సదస్సులో ఎలక్ర్టానిక్స్ పై చర్చలో పాల్గొన్న మంత్రి లోకేశ్ దక్షణాది రాష్ర్టాలతో పోలిస్తే ఏపీ తలసరి ఆదాయం తక్కువని, మూడున్నరేళ్లలో సమస్యలు అధిగమించి అభివృద్ధి వైపు పయనిస్తున్నామని చెప్పారు. 2022 నాటికి అభివృద్ధి చెందిన మూడు రాష్ర్టాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలవాలనేది తమ లక్ష్యమని చెప్పారు. లక్ష్య సాధనకు 15 శాతం వృద్ధి సాధించాలని చెప్పిన లోకేశ్ .. ప్రస్తుతం 12శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు కారిడార్ ఆధారంగా ఎలక్ర్టానిక్స్ రంగం వృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పరిశ్రమలతో మాట్లాడి అవసరమైన విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. విభజన సమయంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడా ఇక్కడ తయారు కాలేదని, ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ప్రతి 10 ఫోన్లలో రెండు ఇక్కడే ఉత్పత్తవుతున్నాయని చెప్పారు. దేశంలో ఉత్పత్తయ్యే ప్రతి 10 ఫోన్లలో 5 ఇక్కడే తయారయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని లోకేశ్ వెల్లడించారు. త్వరలో అమరావతిలో చిప్ డిజైన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చిప్ డిజైన్ నుంచి ఎలక్ర్టానిక్స్ తయారీ వరకూ మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. డిజైన్ , తయారీ , సరఫరాలో అగ్రగామిగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న లోకేశ్ ఎలక్ర్టానిక్స్ తయారీ రంగంలో ప్రపంచంతో పోటీ పడాలనేది తమ లక్ష్యం లోకేశ్ తెలిపారు.