శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా దక్షిణ కొరియాలో ఉన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్కు ఆ దేశం విందు ఇచ్చింది. ద.కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ నేడు కిమ్ యో జోంగ్ సహా తమ దేశానికి వచ్చిన ఉ.కొరియా ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి విందు ఏర్పాటు చేశారు. సియోల్లోని అధ్యక్ష నివాసంలో మూన్ వారితో లంచ్ సమయంలో సమావేశమయ్యారు. ఇరు శత్రుదేశాల మధ్య జరిగిన ఈ విందు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ద.కొరియాలోని ప్యాంగ్చాంగ్లో నిన్న ప్రారంభమైన శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కిమ్ యో జోంగ్తో ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాస్త స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. కిమ్ యో జోంగ్తో పాటు ఉ.కొరియా ప్రతినిధుల బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిమ్ యాంగ్ నామ్ క్రీడల ప్రారంభ వేడుకల్లో వీఐపీ బాక్స్లో కూర్చున్నారు. వారికి కొంత దూరంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూర్చున్నారు.
ఉ.కొరియా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో గత కొంత కాలంగా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒలింపిక్స్ కారణంగా ఇరు దేశాల మధ్య పలు చర్చల అనంతరం ఉ.కొరియా తమ క్రీడాకారులను ద.కొరియాకు పంపించడానికి అంగీకరించింది.