ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శుభమన్ గిల్‌లో అంకితభావం ఎక్కువ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 30, 2018, 04:47 PM

అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ని ఒంటి చేత్తో గెలిపించిన శుభమన్‌ గిల్‌కి ఆట పట్ల అంకితభావం ఎక్కువని అతని తండ్రి లిఖ్విందర్ వెల్లడించారు. గిల్ (102 నాటౌట్: 94 బంతుల్లో 7x4) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో పాకిస్థాన్ పేలవ రీతిలో 29.3 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలిపోయింది. గిల్ బ్యాటింగ్‌ ప్రదర్శనతో తాము చాలా ఆనందించామని.. పాకిస్థాన్ జట్టుపై అజేయ శతకం చేయడం మరింత సంతృప్తినిచ్చింద‌ని లిఖ్విందర్ వివరించారు.


‘శుభమన్ గిల్‌కి క్రికెట్‌ పట్ల అంకితభావం ఎక్కువ. ప్రపంచకప్‌లో నా కొడుకు ప్రదర్శన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సెమీ ఫైనల్లో శతకం చేయడం, పాకిస్థాన్‌ జట్టుని భారత్‌ ఓడించడంతో అది మరింత రెట్టింపు అయ్యింది. చిన్నప్పటి నుంచి బొమ్మల కంటే బ్యాట్, బంతితోనే ఎక్కువ సమయం గిల్ గడిపేవాడు. రాత్రి పడుకునే ముందు కూడా క్రికెట్ ఆడుతుండేవాడు. అతని కలలు నెరవేర్చుకునేందుకు మా ఫ్యామిలీ పరంగా పూర్తి మద్దతిస్తాం. ఇప్పటికే గత దశాబ్దకాలంగా ఎన్నో ఫ్యామిలీ ఫంక్షన్లకి మేము దూరమయ్యాం. ఇకపై కూడా అతని కోసం త్యాగాలు చేసేందుకు మేము సిద్ధం’ అని లిఖ్విందర్ వివరించారు. శనివారం జరగనున్న టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొట్టనుంది. 


బెంగళూరు వేదికగా గత శని, ఆదివారం జరిగిన ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో రూ.20లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శుభమన్‌ గిల్‌ని దక్కించుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు ఉండటంతో.. కోల్‌కతా నైట్‌రైడర్స్ చివరికి రూ. 1.8 కోట్లు వెచ్చించీ మరీ ఈ యువ హిట్టర్‌ని కొనుగోలు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com