ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీశాంత్‌ను తలపై కొట్టాలనిపించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 02:23 PM

క్రికెట్లో స్లెడ్జింగ్‌ గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. బ్యాట్స్‌మెన్‌ను కవ్వించేందుకు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు మాటల యుద్ధానికి దిగుతూ ఉంటారు. ప్రస్తుతం భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఈ నెల 24న జొహానెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానంలో ప్రారంభంకానుంది.


ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ బౌలర్‌ ఆండ్రీ నెల్‌ 2006లో ఈ మైదానంలో చోటు చేసుకున్న ఓ సంఘటనను పంచుకున్నాడు. ‘2006లో రాహుల్‌ ద్రవిడ్‌ నాయకత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చింది. వాండరర్స్‌ మైదానంలో జరిగిన తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించింది. ఈ టెస్టు జరిగే సమయంలో నాకు భారత బౌలర్‌ శ్రీశాంత్‌ను తలపై కొట్టాలనిపించింది. ఎందుకంటే ఈ టెస్టులో మేము పరాజయం పాలవ్వడానికి కారణం అతడే. తొలి ఇన్నింగ్స్‌లో అతడు కేవలం 40 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 168 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీశాంత్‌ బ్యాటింగ్‌ చేయడానికి వచ్చే సమయానికి ఆ జట్టు 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆ సమయంలో శ్రీశాంత్‌పై మాటల యుద్ధానికి దిగాను. ఏమన్నానో సరిగా గుర్తులేదు కానీ. నా మాటలకు అతడు తీవ్రంగానే స్పందించాడు. నేను వేసిన ఓ బంతిని నా తల మీదుగా సిక్స్‌ బాదాడు. ఆ తర్వాత అతడు బ్యాట్‌ను తన తల చుట్టూ తిప్పుతూ సంబరాలు చేసుకున్నాడు. దీంతో నాకు పట్టరాని కోపం వచ్చింది. వెళ్లి శ్రీశాంత్‌ తలపై కొట్టాలనిపించింది. కానీ, నా ఆవేశాన్ని అణచివేసుకున్నాను. మ్యాచ్‌ అనంతరం భారత ఆటగాళ్లను అభినందించే క్రమంలో నేనే మొదట ఉన్నాను. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉన్న శ్రీశాంత్‌ను చూడగానే నాకు నవ్వొచ్చింది. శ్రీశాంత్‌తో ఈ వివాదం తలచుకుంటే నాకు ఇప్పటికీ నవ్వొస్తోంది.’అని నెల్‌ వివరించాడు.


వాండరర్స్‌ మైదానంలో ఇప్పటి వరకు భారత్‌ నాలుగు టెస్టులు ఆడింది. ఈ మైదానంలో భారత జట్టు ఓడిపోయిన దాఖలాలు లేవు. ఆడిన నాలుగింట్లో ఒక విజయంతో పాటు మూడు డ్రాలతో సరిపెట్టుకుంది. ప్రస్తుత మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భారత్‌ రెండింట్లో ఓటమి పాలైంది. అచ్చొచ్చిన వాండరర్స్‌ మైదానంలో భారత్ ఓటమిని అధిగమించి విజయం సాధించాలని ఆశిద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com